ఇరాన్‌తో చర్చల కోసం నాపై ఎలాంటి ఒత్తిడి లేదు: డొనాల్డ్ ట్రంప్

  • సంఘర్షణను తాను త్వరగా ముగించాలనుకుంటున్నట్లు చాలామంది భావిస్తున్నారని వ్యాఖ్య
  • కానీ అలాంటిదేమీ లేదన్న డొనాల్డ్ ట్రంప్
  • అమెరికా ప్రజల కోసం మంచి ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టి సారించినట్లు వెల్లడి
ఇరాన్‌తో చర్చలు పునఃప్రారంభించడానికి తనపై ఎలాంటి ఒత్తిడి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కాల్పుల విరమణ పొడిగింపు స్వల్పకాలమే అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు.

ఈ సంఘర్షణను తాను త్వరగా ముగించాలనుకుంటున్నట్లు ప్రజలు భావిస్తున్నారని, కానీ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తమ ఆలోచన అంతా అమెరికా ప్రజల కోసం ఒక మంచి ఒప్పందం కుదుర్చుకోవడం పైనే ఉందని అన్నారు. శాంతి ప్రతిపాదనను సమర్పించడానికి ఇరాన్‌కు ఎలాంటి గడువును విధించలేదని అన్నారు.

కాల్పుల విరమణ కొనసాగుతుండగా హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. బుధవారం ఇరాన్ పలు నౌకలపై కాల్పులు జరిపి, కొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశంపై కూడా ట్రంప్ స్పందించారు. ఇరాన్ స్వాధీనం చేసుకున్న నౌకలు తమవి కావని తెలిపారు.

హర్మూజ్ జలసంధిలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఇరాన్ నాయకత్వాన్ని దిగ్బంధనం ఎక్కువగా భయపెడుతోందని వ్యాఖ్యానించారు. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలకు అధిక నష్టం జరుగుతోందని, దీంతో వారి చమురు బావులు శాశ్వతంగా మూతపడాల్సిన పరిస్థితి రావొచ్చని హెచ్చరించారు.

Donald Trump
Iran
US Iran talks
Iran Nuclear Deal
Hormuz Strait
Iran Sanctions
Oil infrastructure

More Telugu News